బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు
Published on 29 Mar 2026, 06:30 PM 36
JH-16505
జనహితం న్యూస్, క్రైమ్: కామారెడ్డి జిల్లా గాంధారిలో మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం ఓ కోడలు తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
బంగారంపై మోజుతో... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాంధారి మండలంలోని సీతాయపల్లి గ్రామంలో కావటి రుక్మవ్వ (73)కు నలుగురు సంతానం. అయితే అందులో ఇద్దరు పెద్ద కొడుకులు చనిపోవడంతో వారి భార్యలు, రుక్మవ్వ వేర్వేరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న కొడుకు మాత్రం హైదరాబాద్లో బతుకుదెరువు కోసం వెళ్లాడు. రెండో కొడుకు భూమయ్య భార్య అయిన కోటవ్వ తరచూ అత్త రుక్మవ్వతో డబ్బుల విషయంలో గొడవ పడుతూ ఉండేది.
శనివారం తెల్లవారుజామున ఎలాగైనా ఆమెను హత్యచేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం తీసుకోవచ్చని ఆలోచన చేసింది. బండరాయితో కొట్టి... రుక్మవ్వ తలపై కోటవ్వ బండరాయితో కొట్టగా ఆమె అక్కడికక్కటే మృతి చెందింది. అటుపై ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు చోరీ చేసి... ఎవరికి తెలియకుండానే అందరితో పాటు ఏడుస్తూ కూర్చుంది. అయితే బంధువులకు అనుమానం రాగా... రుక్మవ్వ కూతురు కిష్టవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి కోడలిని నిందితురాలిగా గుర్తించారు. నేరస్థలాన్ని సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
