భూ సమస్యలకు చెక్.. భూభారతి పోర్టల్ ప్రారంభం!
Published on 02 Apr 2026, 08:52 PM 17
JH-77165
జనహితం న్యూస్, రంగారెడ్డి: భూ సమస్యల పరిష్కారానికి నూతన ఇంటిగ్రెటెడ్ వెబ్సైట్. ఒకే వేదికపై రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది.
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, గతంలోని లోపాలను సరిదిద్ది సామాన్యులకు, రైతులకు భూ భద్రత కల్పిస్తూ, సులభరతమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే భూభారతి పోర్టల్ రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నూతన ఇంటిగ్రేటెడ్ వ్యవస్థకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం విటాయిపల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన గ్రామసభ వేదికగా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.
ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి భూయజమానికి వారి భూమికి ప్రత్యేకంగా భూధార్ నంబర్ను కేటాయిస్తారు. దీనివల్ల భూమి వివరాల్లో పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.
ఇకపై భూమి రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం డాక్యుమెంట్లు మాత్రమే కాదు, క్షేత్రస్థాయి కొలతలతో కూడిన మ్యాప్ను కూడ జత చేయడం జరుగుతుంది. అమ్మేవారి నుంచి కొనేవారికి భూమిని కొలిచి అప్పగించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది.
పాతకాలపు గొలుసు పద్ధతులకు స్వస్తి పలికి, అంగుళం కూడా తేడా లేకుండా కొలతలు తీసే రోవర్ యంత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందుకోసం 5300 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి మండలానికి 6 నుంచి 7 మందిని కేటాయించాం. రాష్ట్రంలో10.984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లు గా విభజించి జీపీవోలను నియమించడం జరిగింది.
కొత్త ఇంటిగ్రేటెడ్ పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా భూ వివరాలను అప్లోడ్ చేస్తే చాలు.. 24 నుంచి 48 గంటల్లో సర్వేయర్ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారు. వారం రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుంది, డాక్యుమెంట్లు యజమానుల ఇంటి అడ్రస్కే నేరుగా చేరతాయి.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చర్యలు చేపట్టాం. ఇందుకోసం ప్రత్యేక జీఓను కూడా తీసుకొచ్చాం. ఇకపై అమ్మిన వారి 'కన్సెంట్' కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, కొనుగోలు చేసిన రైతుల స్వంత డిక్లరేషన్తో భూమి రిజిస్ట్రేషన్ అయ్యేలా నిబంధనలు సులభతరం చేయడం జరిగింది.
గతంలో మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయితీలకు ధరణిలో భూమి రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉండేది కాదు. భూభారతి ద్వారా ఈ అడ్డంకిని తొలగించి అన్ని ప్రాంతాల్లోనూ సేవలు అందుబాటులోకి తెచ్చాం.
గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ మ్యాప్ తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందించడం ద్వారా దొంగ పాస్ బుక్కులు రద్దవుతాయి. నిజంగా భూమి ఉన్నవారికి పాస్ బుక్ వస్తుంది. ఈ విధంగా మ్యాప్ లను అందించడం వల్ల భవిష్యత్ లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ఈరోజున అమనగల్ మండలంతోపాటు కుసుమంచి, అశ్వరావుపేట, వట్పల్లి, కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలను 45రోజుల తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులతో 2వదశలో జిల్లాకో మండలంలో ప్రారంభిస్తాం.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు.
ఈ కార్యక్రమంలో నాతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు , రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
భూ భారతి ఆఫిసిఅల్ వెబ్సైట్: https://bhubharati.telangana.gov.in/.
