మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం – గౌరీదేవిపల్లి ప్లాంట్ పరిశీలించిన నిరంజన్ రెడ్డి
Published on 25 Mar 2026, 11:20 PM 12
JH-50120
జనహితం న్యూస్, వనపర్తి : వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. వేసవికాలంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్లాంట్ పనితీరు, నీటి సరఫరా పరిస్థితులపై వివరాలు తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 17 నియోజకవర్గాలకు శుద్ధమైన తాగునీరు అందుతోందని పేర్కొన్నారు. కెఎల్ఐ పథకంలో భాగంగా ఏలూరు రిజర్వాయర్ ద్వారా నీటిని పంపింగ్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, వనపర్తి జిల్లాకు కూడా తాగునీరు అందించే ప్రత్యేక స్కీమ్ ఇక్కడి నుంచే అమలవుతోందని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా కరెంట్ కోతల కారణంగా నీటి సరఫరా అంతరాయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి ఏర్పడిందని విమర్శించారు. కొత్త పథకాలు అమలు చేయలేకపోయినా, ఇప్పటికే ఉన్న పథకాలను సక్రమంగా నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
