యాప్ ద్వారానే ఇసుకను బుక్ చేసుకోవాలని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ సూచన
Published on 04 Apr 2026, 08:24 PM 46
JH-83277
జనహితం న్యూస్, కామారెడ్డి: యాప్ ద్వారానే ఇసుకను బుక్ చేసుకోవాలని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ సూచించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
‘మన ఇసుక వాహనం’ ద్వారా...
కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక గృహ నిర్మాణదారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను సరఫరా చేయుటకు ప్రభుత్వం ‘మన ఇసుక – వాహనం’ ఆన్లైన్ విధానాన్ని అమలుపరుస్తోంది. ఈ విధానంలో భాగంగా, ఇసుక అవసరమున్న వినియోగదారులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం (https://tgmiv.cgg.gov.in)లో లాగిన్ అవ్వాలి. అనంతరం సంబంధిత పంచాయతీ సెక్రటరీ దరఖాస్తును పరిశీలించి తహశీల్దార్కు పంపుతాడు. తహసీల్దార్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారు.
ఆన్లైన్లో చెల్లింపులు... అనుమతి వచ్చిన తరువాత
దరఖాస్తుదారుడు ఆన్లైన్లో చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అనంతరం, అనుమతి పొందిన ఇసుక అమ్మకం జరిగే ప్రాంతానికి ట్రాక్టర్తో వెళ్లి, సంబంధిత అధికారికి తనకు వచ్చిన క్యూఆర్ కోడ్ను చూపించి ఇసుకను నింపుకొని వెళ్లవచ్చు. ప్రభుత్వ అవసరాల కోసం ఇసుకను సంబంధిత ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారి దరఖాస్తును ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది.
