అమరావతి విశ్వనగరంగా ఎదుగుతుంది.. సీఎం సంకల్పం నెరవేరుతుందన్న నాగ ఫణిశర్మ
Published on 22 Mar 2026, 02:44 PM 5
JH-17293
జనహితం న్యూస్, విజయవాడ: ఉగాది పర్వదినం సందర్భంగా జరిగిన పంచాంగ శ్రవణంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక ప్రగతి, ప్రజలకు సుఖశాంతులు కలుగుతాయని బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణిశర్మ తెలిపారు. ముఖ్యంగా అమరావతి విశ్వనగరంగా ఎదిగే దిశగా ముందడుగులు పడతాయని స్పష్టం చేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఉగాది పచ్చడి సేవించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా నాగ ఫణిశర్మ పంచాంగ పఠనం చేసి, ఈ ఏడాది ఫలితాలపై వివరణ ఇచ్చారు.
ప్రభుత్వం సంకల్పించిన కార్యక్రమాలు సఫలమవుతాయని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యంగా ముందుకు సాగుతాయని ఆయన తెలిపారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగుంటుందని, ఉగాదికి ముందు కురిసిన వర్షం ఇందుకు సంకేతమని పేర్కొన్నారు.
అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని తెలిపారు.
ఉగాది పచ్చడి మన జీవితానికి ప్రతిబింబమని, షడ్రుచుల్లానే సుఖదుఃఖాలు సహజమని సీఎం వ్యాఖ్యానించారు. పండుగలు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పుతాయని, మన ఆచారాల్లోనే శాస్త్రం దాగి ఉందని చెప్పారు. యోగా, నేచురోపతి వంటి పద్ధతులు ప్రకృతితో ముడిపడి ఉన్నాయని వివరించారు.
రాష్ట్రంలో నీటి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చే విధంగా నీటి యాజమాన్యం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయని, మే 15 నాటికి నారుమళ్లు వేసుకోవాలని ముందుగానే సూచించామని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, కృష్ణా డెల్టా, విశాఖ ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపడుతుందని వివరించారు.
టెక్నాలజీ వినియోగంపై కూడా సీఎం దృష్టి సారించారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి సాంకేతిక పాలన సాధ్యమవుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లపై ముందుగానే ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు మన సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారని అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు మద్దతు, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
యువతకు ఉపాధి కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పారు. గతంలోనే వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని వివరించారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ మాట్లాడుతూ, పరాభవ నామ సంవత్సరంలో సాంస్కృతిక చైతన్యం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి ఆర్థికాభివృద్ధి, ప్రజలకు సుఖశాంతులు కలుగుతాయని, ఎలాంటి విఘ్నాలు లేకుండా సంవత్సరం సాఫీగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమం ముగింపులో నాగ ఫణిశర్మను సీఎం సత్కరించగా, ఉగాది పురస్కారాలను వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులకు అందజేశారు. మొత్తం 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
