పామాయిల్ కార్మికుడు శివాజీ మృతి – రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్
Published on 31 Mar 2026, 11:39 PM 11
JH-91102
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలంలోని కరెంట్ షాక్కు గురై వ్యక్తి మృతిపామాయిల్ గెలలు కోస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన బెన్ని శివాజీ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గూడలి వెంకట్రావు డిమాండ్ చేశారు.
మంగళవారం ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలంలోని రాజపోతేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన శివాజీ పామాయిల్ కార్మికుడిగా జీవనోపాధి పొందుతూ, గెలలు నరుకుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్తో మరణించారు. ఈ ఘటనపై వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శివాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడి కుటుంబానికి కరెంట్ డిపార్ట్మెంట్ తరపున 25 లక్షల రూపాయల నష్టపరిహారం, పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి మరో 10 లక్షల రూపాయలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని ప్రయోజనాలను మృతుడి కుటుంబానికి అందించాలని కోరారు. పామాయిల్ కార్మికుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది కాలంలోనే జిల్లాలో సుమారు 5 నుండి 6 మంది కార్మికులు గెలలు నరుకుతూ విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రభుత్వం సమన్వయంతో పామాయిల్ కార్మికులందరికీ ప్రమాద బీమా (ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరారు.
