డిపో మేనేజర్పై ఆగ్రహంతో కార్మికుల రిలే నిరాహార దీక్షలు
Published on 08 Apr 2026, 04:52 PM 77
JH-56338
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
డిపో మేనేజర్ వైఖరిని నిరసిస్తూ..
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు రవీందర్ మాట్లాడుతూ.. బాన్సువాడ డిపోలో 25 రోజులుగా డ్రైవర్లు టీజీ ఆర్టీసీ సాజిద్, రియాజ్లను విధులకు పంపకుండా వేధిస్తున్నారన్నారు. తమను బలవంతంగా డ్రైవర్తో పాటు కండక్టర్ విధులు కూడా నిర్వహించాలని డిపో మేనేజర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తమకు ఆంగ్ల భాష తెలియదని, కండక్టర్ పనులు చేయడం సాధ్యం కాదని పలుమార్లు చెప్పినా వినిపించుకోకుండా డ్రైవర్ విధులకు సైతం తమను అనుమతించట్లేదన్నారు. దీంతో పాటు ఈనెల జీతంలో కోత విధించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై నిరసనగా డిపో ఎదుట ధర్నా నిర్వహించగా, సంబంధిత డ్రైవర్లకు చార్జ్ షీట్లు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో మరే మార్గం లేక నేటి నుంచి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించామని తెలిపారు.
యాజమాన్యం స్పందింకపోతే..
నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తామని, అయినా యాజమాన్యం స్పందించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని కార్మికులు హెచ్చరించారు. నిరాహార దీక్షలో డ్రైవర్ రియాజ్, ఎస్డబ్ల్యూఎఫ్ మాజీ రీజినల్ అధ్యక్షులు బి.శంకర్ పాల్గొన్నారు. వీరికి మద్దతుగా డిపో కార్మికులు, ఇతర యూనియన్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
