బీసీ హాస్టల్ విద్యార్థిని మృతి కలకలం.. ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత, రాస్తారోకో
Published on 15 Apr 2026, 08:28 PM 81
JH-90144
జనహితం న్యూస్, కామారెడ్డి: బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థిని శ్రావణి మృతిపై అనుమానాలున్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి..
విద్యార్థినిపై దాడి జరిగిందనే అనుమానాలు ఉన్నాయని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో విరమించాలని ఎస్సై మహేష్, సీఐ రాజిరెడ్డి లో సర్దిచెప్పినా ఆందోళన విరమించలేదు. బాలికల వసతిగృహంలో కనీస వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాచ్మన్ లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, రాత్రిపూట అధికారులు ఎవరూ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ కు తరలింపు...
రాస్తారోకోతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడడంతో బాన్సువాడ డీఎస్పీ విఠల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాస్తారోకో విరమించాలని కోరినా విరమించకపోవడంతో ఆందోళన కారులను పోలీస్ స్టేషన్ కు తరలిచారు. వారిని నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, భిక్కనూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే మాట్లాడతామని అనంతరం సమగ్ర విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
