బాన్సువాడ డిగ్రీ కళాశాలలో హెల్త్ క్యాంప్ ఘనంగా నిర్వహణ
Published on 28 Mar 2026, 12:26 PM 58
JH-16775
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ అటానమస్ డిగ్రీ పీజీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం 'హెల్త్ క్యాంప్ - 2026' ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ సాయిలు మన్నె మరియు చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సౌజన్య గోలే హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ సాయిలు మాట్లాడుతూ.. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి, జంక్ ఫుడ్ మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, విద్యార్థులు వీటిని పూర్తిగా మానేయాలని హితవు పలికారు.
డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ... వేసవి కాలంలో చర్మ రక్షణకు సన్ స్క్రీన్ లోషన్లు వాడాలని, అధికంగా కాస్మోటిక్స్ వాడటం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.మంచి నిద్ర, పుష్టికరమైన ఆహారం ఆరోగ్యానికి ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూరు గంగాధర్ మాట్లాడుతూ... విద్యార్థులు డాక్టర్ల సలహాలను పాటిస్తూ, ప్రతిరోజూ ఎక్కువ నీరు త్రాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రఫియా, కృష్ణ, పద్మ, సన బేగం, బాలరాజ్, వినయ్ కుమార్, విఠల్, రేఖ, అనిత, రాజేష్, శ్రీనివాస్ మరియు సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
