పూరి గుడిసె నుంచి పక్కా ఇంటికి…ఇందిరమ్మ ఇంటి సంతోషం కళ్లలోకి తెచ్చిన కన్నీళ్లు
Published on 09 Apr 2026, 05:55 PM 92
JH-46217
జనహితం న్యూస్, కామారెడ్డి: నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో ఒక పేద కుటుంబం జీవితంలో కొత్త వెలుగు ప్రసరించింది. పూరి గుడిసెలో కష్టకాలాన్ని గడిపిన ఆ కుటుంబానికి, ఇందిరమ్మ ఇల్లు పథకం ఆశాకిరణంగా మారి, ఇప్పుడు పక్కా ఇంటిలోకి అడుగుపెట్టే అదృష్టం కలిగించింది. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో ఈ ఇంటి నిర్మాణం పూర్తయింది.
ఈ సంతోషకర సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆ కుటుంబాన్ని స్వయంగా కలిసి కొత్త ఇంటిని పరిశీలించారు. పూరి గుడిసెలో కష్టాల మధ్య జీవించిన వారు,ఇప్పుడు పక్కా ఇంటిలోకి అడుగుపెట్టిన ఆనందంతో కళ్లలో ఆనందభాష్పాలు ముదిరాయి. లబ్ధిదారుడి భావోద్వేగంతో నిండిన మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి.
ఈ దృశ్యాన్ని చూసిన ఏలే మల్లికార్జున్ కూడా క్షణం భావోద్వేగానికి లోనై, “ఇదే నిజమైన ప్రజాసేవ ఫలితం” అని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేదల పట్ల ఉన్న నిబద్ధతను ప్రత్యేకంగా కొనియాడారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో ఇలాంటి సంక్షేమ పథకాలు కీలకమని అన్నారు. అనంతరం, జక్కాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బసప్ప తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం కావడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
తదుపరి, జక్కాపూర్ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న నూతన గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించిన ఏలే మల్లికార్జున్ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
