అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జయంతులకు భారీ ఏర్పాట్లు!
Published on 01 Apr 2026, 07:19 PM 59
JH-70731
జనహితం న్యూస్, కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 01 : రానున్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు.
బుధవారం కామారెడ్డి జిల్లా కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో అసోసియేషన్ సభ్యులు, సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వేదిక వద్ద కూర్చునే సౌకర్యాలు, త్రాగునీరు, భోజన ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఏసీఎల్బీ మధుమోహన్, ఆర్డీఓ ఎన్.వి. గిరి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, సంఘ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
