మెదక్లో వైభవంగా సీతారాముల కళ్యాణం – పద్మదేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు
Published on 27 Mar 2026, 06:58 PM 77
JH-12045
జనహితం న్యూస్, మెదక్ రూరల్ మార్చి 27: మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల జయజయధ్వానాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా జరిగింది. ఆలయ పూజారి ఆధ్వర్యంలో వేదపండితులు అభిజిత్ లగ్నంలో సంప్రదాయబద్ధంగా కళ్యాణ తంతును నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. ఉదయం 11:00 గంటలకు సీతారాములను పల్లకీలో తీసుకువచ్చి మండపంలో ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో కళ్యాణం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ తంతును భక్తులు ఆనందభరితంగా తిలకించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... మెదక్ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆయన గుణగణాలను అందరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ప్రభుత్వం పేద ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కౌన్సిలర్లు మాయ గంగామణి మల్లేశం, కొట్టాల లలితమ్మ విశ్వం, పట్టణ పార్టీ కన్వీనర్ గడ్డమీద కృష్ణ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, మాజీ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్ మాయ మల్లేశం, బిఆర్ఎస్ నాయకులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
