ప్రజా వేడుకోలు - భారీ పాదయాత్ర, కొత్త బి.టి. రోడ్డు మరియు వంతెనల నిర్మాణం కోసం పోరుబాట!
Published on 18 Apr 2026, 12:11 AM 6
JH-47599
టీ నర్సాపురం మండలం, (జనహితం న్యూస్) : స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ మన ప్రాంత ప్రజలకు కనీస రహదారి సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటు. ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం, తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలోని మధ్యాహ్నపువారిగూడెం, అప్పలరాజుగూడెం మరియు మల్లప్పగూడెం గ్రామాల మధ్య ఇప్పటికీ సరైన రోడ్డే లేదు. వంతెన లేక, మట్టి రోడ్డు కూడా సరిగా లేక వర్షాకాలం వస్తే ఈ ప్రాంతం బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఒక ద్వీపంలా మారుతోంది.
సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఆసుపత్రికి వెళ్లాలన్నా, రైతులు తమ కష్టార్జితమైన పంటను మార్కెట్కు తరలించాలన్నా పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, కొత్త బి.టి. రోడ్డు సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపడుతున్నాం.
మన ప్రధాన డిమాండ్లు:
- నూతన బి.టి. రోడ్డు: అప్పలరాజుగూడెం, మధ్యాహ్నపువారిగూడెం, మల్లప్పగూడెం నుండి తిరుమలదేవిపేట వరకు కొత్త బి.టి. రోడ్డును వెంటనే నిర్మించాలి.
- వంతెన నిర్మాణం: అప్పలరాజుగూడెం - మధ్యాహ్నపువారిగూడెం మధ్య వాగుపై తక్షణమే వంతెన నిర్మించాలి.
- యుద్ధ ప్రాతిపదికన పనులు: నిధుల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలి.
గ్రామస్తులకు విజ్ఞప్తి :
అసలు రోడ్డే లేని మన దుస్థితిని మార్చుకోవడానికి, మన ఊరి భవిష్యత్తు కోసం కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అప్పలరాజుగూడెం, మధ్యాహ్నపువారిగూడెం, మల్లప్పగూడెం మరియు తిరుమలదేవిపేట గ్రామ ప్రజలందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.
"రోడ్డు లేని ఊరు - అభివృద్ధికి దూరం! రోడ్డు సాధన మనందరి బాధ్యత!"
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఏలూరు జిల్లా విభాగం.
