సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల అల్టిమేటం
Published on 26 Mar 2026, 07:31 PM 62
JH-84410
జనహితం న్యూస్, కామారెడ్డి మార్చ్ 26: కామారెడ్డి జిల్లా లో విద్యుత్ ఆర్టిజన్ తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ మేరకు కామారెడ్డి బాన్సువాడ విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.కామారెడ్డి పట్టణంలోని..విద్యుత్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ ఛైర్మన్ సునీల్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టిజన్ విద్యుత్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా ఆర్టిజన్ కార్మికులను విద్యుత్ శాఖ శాశ్వత కార్మికులకు గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను అమలు చేయకపోతే వచ్చే నెల 8న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్మికులు సమ్మె లోని వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టిజన్, పీస్ రేట్, అన్మ్యాన్డ్ కార్మికులు భారీగా ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలు ఇప్పటికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. అదేవిధంగా పని భారం తగ్గించడంతో పాటు మ్యాన్పవర్ పెంచాలని, పీఆర్సీ పెంపు చేయాలని, పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
ధర్నాలో బాన్సువాడ, బిచ్కుంద ఉమ్మడి డివిజన్కు చెందిన సుమారు 170 మంది కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి సమీ, నాయకులు శివకుమార్, వినోద్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
