ధాన్యం కాంటాలు లేక రైతుల ఆగ్రహం - సొసైటీకి తాళం వేసిన రైతులు
Published on 19 Apr 2026, 02:00 PM 66
JH-18643
జనహితం న్యూస్, బిర్కూర్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బిర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో రైతులు సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. సొసైటీ పరిధిలో కోసిన ధాన్యానికి కాంటాలు పెట్టడం లేదని, ఇతర గ్రామాలకు వెళ్లి కాంటాలు పెడుతున్నారని రైతులు ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ కార్యదర్శి గత వారం రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో పాటు, ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు తెలిపారు.
వాతావరణ హెచ్చరికలు ఉన్న ఈ సమయంలో ధాన్యం తడిసి పోతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఏప్రిల్ 4న కోసిన వడ్లకు ఇప్పటికీ కాంటాలు పెట్టక పోగా,18వ తేదీన కోసిన వడ్లకు మాత్రం వెంటనే కాంటాలు పెట్టారని రైతులు ఆరోపించారు. రైతుల మధ్య వివక్ష చూపకుండా వెంటనే అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే మరింత పెద్ద స్థాయిలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బోడమీది హనుమండ్లు, బుద్ధి శ్రీనివాస్, పోతురాజు నాగప్ప తదితరులు రైతులు పాల్గొన్నారు.
