రోడ్లపై వడ్ల కుప్పలు.. ప్రయాణికులకు తిప్పలు
Published on 11 Apr 2026, 08:52 PM 73
JH-39375
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లో రోజుకు వందలది వాహనాలు తిరిగే నిజామాబాద్ - బాన్సువాడ ప్రధాన రహదారి పై వడ్లు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వరి పంట కోత సీజన్ లో ఇదే సమస్య ఎదురవుతోంది. గడిచిన ఎళ్లలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోడ్లపై వడ్ల కుప్పల కారణంగా ప్రమాదాలు జరిగి చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేకపోవడం వల్ల రైతులు రోడ్లపై వడ్లు ఆరబోస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల జరిగే ప్రమాదాలపై రైతులకు పోలీసులు, సంబందిత అధికారులు అవగాహన కల్పించాలిని ప్రయాణికులు కోరుతున్నారు.
అనేక రోడ్లపై వడ్ల కుప్పలు..
గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులతో పాటు, నేషనల్ హైవేలపై సైతం రైతులు వడ్లు ఆరబోస్తున్నారు. బాన్సువాడ నుంచి నిజామాబాద్ వేళ్లే రూట్లో, వర్ని, మోస్రా, చందూర్, మల్కాపూర్, రూట్లో, రోడ్డుపై వడ్లు ఆరబోస్తున్నారు. రాత్రి పూట వడ్లను కుప్ప చేసి వర్షానికి తడవకుండా టాపర్లుకప్పి, గాలికి ఎగిరి పోకుండా బండరాళ్లు పెడుతున్నారు. రోడ్డు సగం వరకు ఆక్రమించి వడ్లు ఆరబోస్తుండగా రాత్రి వేళ కుప్పలు, బండరాళ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతోపాటు, ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై సగం వరకు వడ్ల కుప్పలు ఉండడంతో ఒకే వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇది ప్రమాదాలకు దారి తీస్తోంది. పోలీసులు, అధికారులు స్పందించి రోడ్లపై పేరుకుపోయిన ధాన్యం కొనుగోలు పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా జగ్రత్తలు తీసుకోవాలని వాహన దారులు కోరుతున్నారు.
