వేలేరుపాడు మండలంలో భారీ అగ్నిప్రమాదం: నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధం
Published on 30 Mar 2026, 05:57 PM 46
JH-89665
జనహితం న్యూస్, వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి గ్రామంలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు ఇళ్లు పూర్తిగా బూడిదయ్యాయి. ఈ ఘటనలో రైతులు తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు.
గ్రామానికి చెందిన సనుగొండ రవి, సనుగొండ వెంకటేష్, సనుగొండ సింగు బాబు, ఎక్కిల శ్రీను అనే నలుగురు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం సుమారు 11:30 గంటల సమయంలో ఒక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. వేసవి ఎండల తీవ్రతకు మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న మిగతా మూడు ఇళ్లకు వ్యాపించాయి.
గమనించిన గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. బాధితులు అందరూ నిరుపేద రైతులు కావడంతో, వారు కష్టపడి పండించిన పంటను అమ్ముకోగా వచ్చిన నగదు, ఇంట్లోని విలువైన వస్తువులు, ధాన్యం నిల్వలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. పొలాల నుండి తిరిగి వచ్చిన రైతులు, తమ కళ్ల ముందే ఇళ్లు కాలి బూడిదవ్వడం చూసి తల్లడిల్లిపోయారు. దాచుకున్న సొమ్ము, నిలవనీడ అగ్నిపాలు కావడంతో ఏం చేయాలో తెలియక బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి ఆశ్రయం కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
